AP Engineering Counselling : ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే!
AP Engineering Special Counselling : ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియకు నవంబరు ఆరో తేదీ నుండి ప్రారంభం అవుతుందని ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం దీనిని నిర్దేశించామన్నారు. తొలి, మలిదశతో పాటు స్పాట్ అడ్మిషన్లు ఇప్పటికే ముగిసాయని, కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని పేర్కొన్నారు. తొలి, మలి దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్థులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్ కు అర్హత కలిగి ఉంటారన్నారు.
కొత్త రిజిస్ట్రేషన్లకు ఛాన్స్ లేదు
అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఉంటుందని, కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని నాగరాణి స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి భిన్న రూపాలలో వచ్చిన అభ్యర్థనల ఫలితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ కు అనుమతి ఇచ్చారన్నారు.
మరోవైపు విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారని నాగరాణి పేర్కొన్నారు.
నవంబరు 10న సీట్ల కేటాయింపు
ప్రత్యేక రౌండ్ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అనుమతి ఉందని కన్వీనర్ నాగమణి వివరించారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలలోని బీఈ/బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు ప్రవేశం కల్పిస్తామన్నారు. శనివారం నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబరు 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. నవంబరు 8వ తేదీన ఆప్షన్ల నమోదు, మార్పుకు అనుమతి ఉంటుందని తెలిపారు. నవంబరు 10న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 11 నుంచి 13 వరకు విద్యార్థులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉందని ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.